భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. న్యూజిలాండ్‌ వ్యాపారాలకు భారీ ఊతం: లక్సన్‌

  • భారత్‌ ఎఫ్‌టీఏపై లక్సన్‌ కీలక వ్యాఖ్యలు
  • తమ 57 శాతం ఎగుమతులకు భారత్‌లో సుంకం ఉందని వెల్లడి
  • తమ వ్యాపారాలకు కొత్త అవకాశాలు వస్తాయన్న లక్సన్‌
  • మోదీ పర్యటనకు ముందే ప్రకటన
  • 40 ఏళ్ల తర్వాత భారత్‌ ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటన
భారత్‌తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) న్యూజిలాండ్‌ వ్యాపారాలకు భారీ అవకాశాలు తీసుకురానుందని ఆ దేశ ప్రధాని క్రిస్టఫర్‌ లక్సన్‌ తెలిపారు. ఒప్పందం అమల్లోకి వచ్చిన తొలి రోజునే న్యూజిలాండ్‌ ఎగుమతుల్లో 57 శాతం వస్తువులు సుంకం లేకుండా భారత్‌లోకి ప్రవేశిస్తాయని వెల్లడించారు.

ఈ మేరకు లక్సన్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ “భారత్‌తో వాణిజ్య ఒప్పందం న్యూజిలాండ్‌ వ్యాపారాలకు కొత్త దారులు తెరుస్తుంది” అని పేర్కొన్నారు. భారత్‌ వేగంగా విస్తరిస్తున్న వినియోగదారుల మార్కెట్‌గా మారుతోందని తెలిపారు. ఈ ఎఫ్‌టీఏ తమ దేశ ఆర్థిక ప్రయోజనాలకు కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై రేపు, ఎల్లుండి న్యూజిలాండ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని న్యూజిలాండ్‌కు అధికారిక పర్యటన నిమిత్తం వెళ్లడం ఇదే మొదటిసారి.

ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని మోదీ తెలిపారు. 2025 మార్చిలో భారత్‌కు వచ్చిన లక్సన్‌ పర్యటన తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ 27న భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య కీలక ఎఫ్‌టీఏపై తుది నిర్ణయం తీసుకున్నారు. దీన్ని “తరతరాలకు ఉపయోగపడే అవకాశం”గా లక్సన్‌ అభివర్ణించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌ ఎదుగుతున్న వేళ ఆ ప్రయాణంలో భాగస్వామ్యం కావడానికి ఈ ఒప్పందం న్యూజిలాండ్‌కు తోడ్పడుతుందని ఆయన అన్నారు.

అటు, భారత్‌-న్యూజిలాండ్‌ సంబంధాల్లో ప్రవాస భారతీయుల పాత్ర కూడా ఎంతో ముఖ్యమని మోదీ గుర్తుచేశారు. న్యూజిలాండ్‌లో వివిధ రంగాల్లో రాణిస్తున్న భారతీయులను కలవాలని తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

Christopher Luxon
Narendra Modi
India New Zealand FTA
India New Zealand Trade Agreement
NZ exports to India
India New Zealand bilateral relations

More Telugu News